అవనిగడ్డ: కృష్ణాజిల్లాలోని రైతులకు సాగునీరు అందించకుంటే ఈనెల ఆరో తేదీన పులిగడ్డలో నిరాహారదీక్ష చేస్తానని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు తెలిపారు. జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలిపేందుకు అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు సింహాద్రి రమేష్బాబు, పేర్ని కిట్టు, ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి, గుడివాడ నియోజవకర్గ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు, పలువురు రైతు విభాగం నాయకులు సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ జి.గుణకరరావును కలిశారు. సింహాద్రి మాట్లాడుతూ.. ఇప్పటికే సాగుకోసం రైతులు 25 శాతం ఖర్చు చేశారని, సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఈని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏడు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లిస్తోందని, దామాషా ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా తీసుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఒకరోజు నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ రైతులతో మహా పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. పేర్ని కిట్టు మాట్లాడుతూ.. ఏరువాక కార్యక్రమం నిర్వహించి రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మంత్రి సినిమా డైలాగులు చెప్పారని విమర్శించారు. నాలుగు వేల క్యూసెక్కుల నీటిని తెచ్చుకుంటే బ్యారేజీ దిగువున ఉన్న రైతులందరూ బయట పడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బీసాబత్తిన ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


