ముగిసిన అంత్యక్రియలు
మచిలీపట్నంటౌన్: ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన జయశ్రీ (జయలక్ష్మి) (50) మృతదేహం మంగళవారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని సర్కిల్పేటలో ఉన్న ఆమె స్వగృహానికి చేరింది. ఆమె మృతదేహం సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలోని ఎయిర్కార్గో విభాగానికి చేరింది. క్లియరెన్స్ ప్రక్రియ పూర్తయిన తరువాత మృతదేహాన్ని ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం ఉదయం 7.20 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్లో మచిలీపట్నం తీసుకువచ్చారు. స్వగృహానికి చేరుకున్న జయశ్రీ మృతదేహాన్ని చూసిన ఆమె కుమారుడు ఆకాష్, కుమార్తె ప్రియాంక, బంధువులు విలపించారు. జయశ్రీ భౌతికకాయానికి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) తదితరులు నివాళులర్పించారు. జయశ్రీ కుటుంబానికి తాము తోడుగా ఉంటామని పేర్ని కిట్టు పేర్కొన్నారు. వియత్నాంలో చికిత్స పొందుతున్న గెల్లి కిషోర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జయశ్రీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


