నందివాడ: జనార్ధనపురం (జొన్నపాడు) గ్రామంలో ఓ మహిళ సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సాగర్ గౌరీపట్నం గ్రామానికి చెందిన నక్క భూలక్ష్మి (30) జనార్ధనపురంలోని ఆర్టీఏ ట్రాక్ సమీపంలో లక్ష్మీ గణపతి బ్రిక్స్ కంపెనీలో పనిచేసేందుకు తన సోదరుడు కన్నయ్య, సోదరితో కలిసి నెల క్రితం వచ్చింది. వారం రోజుల క్రితం కన్నయ్య తన సోదరి భూలక్ష్మి నుంచి వెయ్యి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వాలంటూ భూలక్ష్మి కన్నయ్యను కోరగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు కన్నయ్య తన చెల్లితో కలిసి గుడివాడ వచ్చాడు. ఈ విషయమై మనస్థాపానికి గురైన భూలక్ష్మి తను ఉరి వేసుకుని చనిపోతున్నానంటూ తన ఫోన్లో స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన పిన్ని ములికి లక్ష్మి కన్నయ్యకు ఈ సమాచారం అందించింది. అతను గుడివాడ నుంచి వచ్చేసరికి భూలక్ష్మి ఇనుపరాడ్డుకు ఉరివేసుకొని ఉంది. వెంటనే ఆమెను కిందకి దింపి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


