ఆలయ అధికారులు, పోలీసు శాఖతో సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత మహామండపం లిఫ్టు నుంచి ప్రారంభమైన అధికారుల పరిశీలన, కనక దుర్గనగర్, చైనా వాల్ పరిసర ప్రాంతాల్లో దేవస్థానం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆషాఢ మాసం నెల రోజులు కనకదుర్గనగర్లో చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్తో పాటు మొబైల్ ఫోన్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులు తొలుత కనకదుర్గనగర్లోని దేవస్థాన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అక్కడి నుంచి మహామండపం ర్యాంప్ మీదగా 7వ అంతస్తుకు, ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి చేరుకోవాలన్నారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులను భవానీ అనుగ్రహ దర్శన్ రూ.100 టికెట్ క్యూలైన్లో అనుమతిస్తారన్నారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ ఉత్సవాలలో భద్రతాచర్యలపై పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ ఏడీసీపీ గుణ్ణం రామ కృష్ణ, ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామ చంద్రరావు, వన్టౌన్ సీఐ గుణరామ్, ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, దుర్గగుడి ఈఈ ఎల్.రమా దేవి, దేవస్థాన ఏసీ రంగారావు, ఇతర ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


