అన్నదానం, లడ్డూపోటులను
పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా అన్ని భవనాలకు ఒకే తరహా రంగులు వేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులకు సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనం, లడ్డూపోటులను శనివారం పరిశీలించారు. కమిషనర్ వెంట చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, డీఈవో కిషోర్కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు అమ్మవారి సన్నిధికి చేరుకునేసరికి ఎంతో ప్రశాంతతను ఇచ్చేలా రంగులను ఎంపిక చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లడ్డూ పోటు వెలుపల వేసిన రంగుల శాంపిల్స్ను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులను పరిశీలించిన అనంతరం సెల్లార్కు చేరుకున్నారు. సెల్లార్ను పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మహామండపం 7వ అంతస్తులోని ప్రాకార ప్రాంతాన్ని సందర్శించారు ప్రాకార మండపానికి వేసిన రంగుల తరహాలోనే నూతన భవనాలను పెయింటింగ్ జరగాలన్నారు. కమిషనర్ పర్యటనలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి.రాఘవరాజు, ఈఈ ఎల్.రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.76 లక్షల పరిహారం
విజయవాడలీగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఏడవ అదనపు జిల్లా జడ్జి బి.అబ్రహం విజయవాడ కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్ లో రూ.76 లక్షల పరిహారం ప్రకటిస్తూ అవార్డు జారీ చేశారు. ఈ.శ్రీనివాస్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన భార్య లక్ష్మీ ప్రసన్న, కుమార్తె, కుమారుడు బీమా కంపెనీ నుంచి కోటి రూపాయలు పరిహారం కోరుతూ న్యాయవాది ఇసంశెట్టి ఉషాజ్యోతి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చోళ మండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.76 లక్షలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. ఇరుపక్షాలు రాజీ మార్గంలో కేసు పరిష్కరించుకోవటానికి అంగీకరించడంతో న్యాయమూర్తి అబ్రహం ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో బాధితులకు అవార్డు కాపీ అందజేశారు.


