గుడివాడరూరల్: గుడివాడ–విజయవాడ హెయిర్ బస్ డ్రైవర్పై మానికొండ వద్ద దాడి జరగడాన్ని నిరసిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ హెయిర్ బస్సుల యూనియన్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు శనివారం బంద్కు దిగారు. డిపో పరిధిలోని 43 హెయిర్ బస్సులను డ్రైవర్లు, కండక్టర్లు నిలిపివేయడంతో జిల్లాలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టిన కార్మికులతో డిపో మేనేజర్ సునీల్కుమార్ చర్చలు జరిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలకు సీఐటీయూ నాయకుడు ఆర్సీపీ రెడ్డి మద్దతు తెలిపారు. దాడికి గురైన బాధిత డ్రైవర్ దుర్గారావు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపమని అడిగాడని, సీట్లు ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సు ఆపానన్నారు. దీంతో ఆ యువకుడు దుర్భాషలాడాడని, దీనికి ప్రతిగా తాను స్పందించానన్నారు. అక్కడ నుంచి బయలుదేరి బస్సు మానికొండ సమీపానికి రాగా ఆ యువకుడు ఇచ్చిన సమాచారంతో అతని కుటుంబ సభ్యులు మానికొండ వద్ద బస్సును చుట్టుముట్టి తనపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సీఐటీయూ నాయకుడు ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణాలు పెరిగాయన్నారు. రద్దీ కారణంగా బస్సులు ఆపకపోతే ఈ మధ్య తరచుగా డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ నాయకుడు రేపాని కొండ, యూనియన్ నాయకులు టి.తేజ, జి.మహేష్, ఎం.నాగార్జున, ఎం.పవన్కుమార్, జాజుల మురళి, యోహాను, అప్పలరాజు, అయ్యప్ప, యూసఫ్ పాల్గొన్నారు.


