మచిలీపట్నంఅర్బన్: మహిళల సాధికారతతోనే ఆరోగ్యవంతమైన కుటుంబాలు సాధ్యమవు తాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ (ఇన్చార్జ్) అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్చంద్ మాట్లాడుతూ ప్రజలకు కుటుంబ నియంత్రణ, తల్లి–శిశు ఆరోగ్యం, పిల్లల మధ్య ఎడం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సాధికారత కలిగిన మహిళలు–ఆరోగ్యవంతమైన కుటుంబాలు–అభివృద్ధి చెందిన దేశం అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, తల్లి–శిశు మరణాలను తగ్గించడం, మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న కుటుంబం–సంతోషకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డాక్టర్ నిరీక్షణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రోజా రమణి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


