భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో యువ కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలోనిని కళావేదికపై నాట్య గురువు మద్దాలి సత్యవాణి శిష్య బృందం కణ్వల, విజయ, నందిత, ప్రసన్న, అనిత, హేమ, వీణ, సరయు, మన్విత, చార్వి, జుహిత, నిష్కళలు పలు అంశాలకు చక్కని అభినయం, ఆహార్యంతో నర్తించి పలువురిరి ప్రశంసలు అందుకున్నారు. వారు ప్రదర్శించిన నృత్యాంశాల్లో నర్తన గణపతిం, బాల కనకమయ, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన, కులుకక నడవరో, కాలభైరవాష్టకం, శివ పంచాక్షరి, శివాష్టకం, ఒక పరికొక పరి, శివస్తుతి, భావములోన, పలుకే బంగారమాయెనా, లింగాష్టకం చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా నాట్య గురువు సత్యవాణి మాట్లాడుతూ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.


