భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతిలోనే మహిళలను గౌరవించే విధానం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను సత్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ప్రధాని మోదీ చేతల మనిషి అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనిదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మనమందరం సంతోషంగా, సుఖంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులే కారణమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందరికంటే మహానుభావులన్న ప్రధాని మోదీ వారి కాళ్లు కడిగారని గుర్తు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నా పెద్ద కుమారుని పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్


