మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ యు.వి.సుబ్బారావు తెలిపారు. ఈ పరీక్షల వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 411 హైస్కూళ్ల నుంచి 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 21,296 మంది, ప్రైవేట్ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వాటిలో 55 ఏ కేటగిరీ కేంద్రాలు, 43 బీ కేటగిరీ, 50 సీ కేటగిరీ (సమస్యాత్మక) కేంద్రాలుగా గుర్తించామన్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంటల్, ఇతర అదనపు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 29 స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, గోప్యమైన సామగ్రి పంపిణీ కోసం పది రూట్లు గుర్తించి, 20 మంది రూట్ అధికారులను నియమించామని వెల్లడించారు. ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్ కస్టోడియన్లు నియమించామన్నారు. సుమారు 1,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల అధికారులతో ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని డీఈఓ సుబ్బారావు తెలిపారు.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు కామర్స్, సోషియాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. 1,835 మంది విద్యార్థులకు 1,739 మంది హాజరవగా, 96 మంది గైర్హాజరయ్యారని, హాజరు 94 శాతంగా నమోదైంది. కామర్స్–2 (పేపర్) పరీక్షకు సెట్–3 ప్రశ్న పత్రాన్ని వినియోగించారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,975 మంది విద్యార్థులకు 3,715 మంది హాజరవగా, 260 మంది గైర్హాజరయ్యారు.


