ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డయల్ 112కు త్వరగా స్పందించాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయరాదని, పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, వాటి పురోగతికి కృషి చేయాలని ఆదేశించారు. కేసుల నమోదు, దర్యాప్తు, నేరస్తుల వివరాల నిర్వహణ, డేటా సమన్వయంలో సీసీటీఎన్ఎస్ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో నాకాబంది, కమ్యునిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


