ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఎన్ఐసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి అర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జైనూర్ మండలం ఉషేగాం గ్రామానికి చెందిన జయ కళాబాయి, కోవ కమలాబాయి, రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్కు చెందిన గుండేటి స్వరూప ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించాలని కాగజ్నగర్ మండలం కోయవాగు గ్రామానికి చెందిన కాంపెల్లి అరుణ అర్జీ అందించారు. తన పట్టా భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని రెబ్బెన మండలం వంకులం జూపాక పోచం దరఖాస్తు చేసుకున్నాడు. చింతలమానెపల్లి బూరెపల్లి గ్రామానికి చెందిన జాడి భగవాన్ తన పట్టా భూమి ఇతరుల పేరిట నమోదైందని, వెంటనే సవరించి తన పేరిట పాసుపుస్తకం ఇప్పించాలని అధికారులకు విన్నవించాడు. కార్యక్రమంలో డీఆర్వో దాసరి వేణు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


