వాంకిడి: అటవీశాఖ అనుమతులు లేక ఏళ్లుగా గిరిజన గ్రామాలకు రహదారి పనులు పూర్తికావడం లేదు. అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు ఆస్పత్రులకు చేరాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. వాంకిడి మండలం సర్కేపల్లికి చెందిన నిండు గర్భిణి దుర్వ కరీష్మకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అయితే రోడ్డు బురదమయంగా ఉండటంతో రెండు కిలోమీటర్ల దూరంలోని మారెపల్లి గ్రామం వద్దే అంబులెన్స్ను నిలిపివేశారు. దీంతో సర్కేపల్లి నుంచి బురద రోడ్డుపై గర్భిణిని ఎడ్లబండిపై 108 వాహనం వరకు తరలించారు. వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి చేరిన పది నిమిషాల్లో సాధారణ ప్రసవం కాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తేవని, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, ఖమాన నుంచి సర్కేపల్లి వరకు 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరైనా అటవీ అనుమతులు అడ్డురావడంతో 2 కి.మీ.ల మేర పనులు నిలిచిపోయాయి.


