గడువు తీరిన తర్వాత పంపిణీ ఆర్డీవో కార్యాలయానికి తిప్పి పంపినా ఎదురుచూపులే.. ఆందోళనలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు
కెరమెరి: పేదింట ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చె క్కుల పంపిణీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గడువు ముగిసిన చెక్కులు పంపిణీ చేయడంతో పలు కుటుంబాలు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కులు విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం ట్రెజరీ నుంచి జారీ అయిన చెక్కులకు 90 రోజుల కాల పరిమితి ఉంటుంది. ఈ చెక్కుల గడువు జూలై 20తో ముగిసింది. కనీసం చెక్కులపై ఉన్న తేదీలను కూడా పరిశీలించకుండా సంబంధిత అధికారులు జూలై 22న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు వారు బ్యాంకులకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆర్డీవో కార్యాలయానికి..
లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో మేల్కొన్న రెవెన్యూ యంత్రాంగం చెక్కుల రీ వ్యాలిడేషన్ మార్పిడి మొదలు పెట్టింది. గడువు ముగిసిన 41 చెక్కులను తిరిగి సేకరించారు. వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని తహసీల్దార్ అధికారిక లేఖతో ఆసిఫాబాద్లోని ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ఆ చెక్కులు ఆర్డీవో కార్యాలయానికి చేరి వారానికి పైగా గడుస్తున్నా నేటికీ పురోగతి లేదు. కల్యాణలక్ష్మి సాయం అందుతుంద నే ఆశతో చాలామంది పేదలు పెళ్లిళ్ల కోసం వడ్డీలకు అప్పులు తెచ్చారు. వారి ఆశలు ప్రస్తుతం ఆడియాశలయ్యాయి. వడ్డీలు కట్టాల్సి రావడంతో వారిపై ఆర్థికభారం పడుతోంది. ఇప్పటికై నా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి కొత్త చెక్కులు త్వరగా పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


