ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలపై ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై జిల్లావ్యాప్తంగా వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు కేవలం కొబ్బరికాయలు కొడుతున్నారే తప్ప పనులు ముందుకు సాగడం లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్లు అలీబిన్ అహ్మద్, శ్రీనివాస్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, నాయకులు రవీందర్, మర్సుకోల సరస్వతి, కలాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


