సీజనల్
వ్యాధులకు
ఆసిఫాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సీతారాం అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లో.. వాతావరణ మార్పుతో జిల్లాలో మలేరియా, డయేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కలెక్టర్ కె.హరిత వైద్యారోగ్య, పంచాయతీ అధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించి దిశా ని ర్దేశం చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో అక్కడక్కడా పైప్లైన్ లీకేజీలున్నాయి. దీంతో తాగునీరు కలుషితమై డయేరియా వచ్చే అవకాశాలున్నాయి. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రజలు ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా జాగ్రత్తలు పాటించాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలి. దోమల నివారణకు వారానికి రెండు సార్లు ఫాగింగ్, లార్విసైడ్ స్ప్రే చేయించాలి. జిల్లాలో పీహెచ్సీల వారీగా ప్రత్యేకంగా సూపర్వైజర్, ఆశ వర్కర్, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లతో టీంలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
గతేడాది 73 డెంగీ కేసులు
జిల్లాలో గతేడాది 73 డెంగీ కేసులు నమోదు కాగా, వీటిలో 67 కేసులు తిర్యాణి మండలం పంగిడి మాదరలో నమోదయ్యాయి. 37 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఎక్కడైనా మలేరియా, డెంగీ కేసులు నమోదైతే వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో పాము కాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. పాము కాటుకు గురైతే ఆ ప్రాంతంలో గట్టిగా కట్టుకట్టి సమీప ఆస్పత్రికి తరలించాలి. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయాలి.
69 మంది గర్భిణులు
జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో హైరిస్క్ ఉన్న గ్రామాల్లో నెలలు నిండిన 69 మంది గర్భిణులు ఉన్నారు. జూలైలో 34 మంది ఉండగా, ఇప్పటికే 13 మందికి, ఆగస్టులో 35 మంది ఉండగా ముగ్గురికి ప్రసవం జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు జైనూర్, సిర్పూర్(యూ), కెరమెరి, తిర్యాణి, కాగజ్నగర్, బెజ్జూర్ మండల కేంద్రాల్లో బర్త్ వెయిటింగ్ రూమ్లు ఏర్పాటు చేశాం. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు పడే అవకాశం ఉంటే గర్భిణులను వారం రోజులు ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలిస్తాం.
వైద్యుల కొరత
జిల్లాలోని 17 పీహెచ్సీల్లో 44 మంది వైద్యులకు గానూ ప్రస్తుతం కేవలం 14 మంది రెగ్యులర్ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యుల కొరత వల్ల ఒక్కో వైద్యుడు రెండు, మూడు పీహెచ్సీలకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించడం అవసరం
కూలర్, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ప్లాస్టిక్ కవర్లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. రాత్రిపూట దోమ తెర కట్టుకొని పడుకోవాలి. గర్భిణులు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాకా లంలో కుళాయి నీరు కూడా కలుషితమయ్యే అ వ కాశం ఉంది. నీటిని కనీ సం 10 నిముషాలు మరిగించి, చల్లార్చి తాగాలి. బయట తినుబండారాలు, రోడ్డు పక్కన అమ్మే ఆహారం మానేయాలి. పండ్లను ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి కడగాలి. వాంతులు విరేచనాలు అయితే ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి కొద్దికొద్దిగా తాగాలి. వెంటనే సమీప పీహెచ్సీ వైద్యుడిని సంప్రదించాలి.
మందుల కొరత లేదు
ముఖ్యంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్, విరేచనాలు, పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్వరం మందులు, యాంటిబయోటిక్స్, మలేరియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి.


