ఎరువుల
కొరత లేకుండా
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి వ్యవసాయ, నీటిపారుదల, తాగునీరు, వైద్యం, విద్యాశాఖ, వాతావరణ పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంది, జొన్న, ఉద్యానవన పంటలు, ఆయిల్పామ్, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఫ్రైడే, డ్రైడే చేపట్టాలన్నారు. వర్షాకాలంలో శుద్ధ జలాన్ని సరఫరా చేయాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి, వరి, ఇతర పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 71శాతం పూర్తయ్యిందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, డీఆర్వో దాసరి వేణు, డీఎంహెచ్వో సీతారాం, డీఏవో వెంకటి, ఎస్ఈ మిషన్ భగీరథ సిద్దిక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


