ఆదిలాబాద్టౌన్: డబ్బులు పెట్టుబడి పెడితే రెండింతలు లాభాలు వస్తాయని ఆశచూపి మోసాలకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో శనివారం ఈమేరకు వివరా లు వెల్లడించారు. హైదరాబాద్ నల్లకుంటకు చెంది న కొణతాల చంద్రశేఖర్ యూనిక్ ఎస్ఎంసీఎస్ కంపెనీ నిర్వాహకుడు. రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఏజెంట్లు సత్యనారాయణ, బొజ్జ గంగారాం ద్వారా జిల్లాలో పలువురి నుంచి పదేళ్లపాటు డిపాజిట్లు సేకరించారు. గడువు ముగి సిన తర్వాత రెట్టింపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడ్డారు. బాధితుడు, జైనథ్ మండలం బెల్గాం గ్రామానికి చెందిన దండేకర్ ఆనంద్రావు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జిల్లాలో ఇప్పటివరకు యూనిక్ ఎస్ఎంసీఎస్ కంపెనీపై మొత్తం 6 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో 40 మంది బాధితులు గుర్తించగా, సుమారు రూ.19 లక్షల మేర పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సమావేశంలో జైనథ్ సీఐ జి.శ్రావణ్, ఎస్సై పి.గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


