రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఏఐటీయూసీ రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు. మంగళవారం స్థానిక కోల్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ప్రతినిధికి సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నా.. కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. బొగ్గు రవాణా చేసే లారీ డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.32వేలు, క్లీనర్లకు రూ.18వేలు ప్రతినెలా 5లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి రూ.25లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రూ.50లక్షల ప్రమాద బీమా కల్పించాలన్నారు. ఈపీఎఫ్ లేదా సీఎంపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏటా ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలని, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలన్నారు. సింగరేణి పర్మినెంట్ కార్మికులతో సమానంగా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు లాభాల వాటా ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాస్, ప్రశాంత్, కృష్ణ, రాజు, చాందర్లాల్, మనోహర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


