అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
దండేపల్లి: జన్నారం మండలం సింగరాయిపేటకు చెందిన బొజ్జిరావ్ అనే యువకుడిని గురువారం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తాళ్లపేట రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కారణం లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. బొజ్జిరావ్తో పాటు కొమ్ముగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్దకు అధికసంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తహసీనొద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి గిరిజనులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు మాట్లాడుతూ బొజ్జిరావ్ సింగరాయిపేట బీట్పరిధిలోని 345 కంపార్ట్ మెంట్లో 8 చెట్లను నరికాడని, పైగా గతంలో అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని, సుధాకర్ గతంలో తానిమడుగు బీట్లో చెట్లునరికి తప్పించుకు తిరుగుతుండడంతో గురువారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి ఇద్దరి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.


