
ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంబీఏ చదివిన తాను వాహన ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉంటున్నానని, జిల్లా కేంద్రంలో ఏదైనా కార్యాలయంలో ఉపాధి అవకాశం కల్పించాలని రవిచంద్ర కాలనీకి చెందిన పర్చకి శారద కోరారు. తెలంగాణ మైనార్టీ కళాశాలలో అధ్యాపకుడి ఉద్యోగానికి ఒప్పంద ప్రతిపాదికన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న తనకు మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని, న్యాయం చేయాలని కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన కోటేశ్ విన్నవించాడు. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం సాండ్గాం గ్రామానికి చెందిన మీరాబాయి దరఖాస్తు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట శివారులోని పట్టా భూమిని ఆన్లైన్లో నమోదు చేసి, పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కుంరం లచ్చు అర్జీ అందించాడు. తన తండ్రి పేరుతో ఉన్న భూమిని కౌటాల మినీ స్టేడియం ఏర్పాటుకు తీసుకుని ఇప్పటివరకు పరిహారం అందించలేదని, న్యాయం చేయాలని కౌటాలకు చెందిన రాచకొండ అశోక్ కోరాడు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.