ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం డిగ్రీ విద్యార్థుల కోసం వినూత్నంగా ‘అన్న–అక్క’ పేరిట మెంటార్షిప్ టీచింగ్, లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఇందులో భాగంగా తమ కళాశాల ఐదో సెమిస్టర్ విద్యార్థులు 350మంది ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్లో శిక్షణ పొందారని వెల్లడించారు. వీరు ఎంపిక చేసిన 59 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘అన్న – అక్క’ కార్యక్రమంలో భాగంగా ఏఐతో పాటు ఇతర అంశాలు బోధిస్తారని తెలిపారు. విడతల వారీగా సెప్టెంబర్ 5వ తేదీలోగా 30 గంటల పాటు బోధించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగేశ్వరరావు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. తొలుత కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి.సర్వేశ్వరరావు, డాక్టర్ డి.శ్రీనివాస్, డాక్టర్ పి.వేణుమాధవ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ పొందాక.. ఇక్కడ అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన


