ప్రత్యేక పరిస్థితులు..
కాల్వలో సిల్ట్ తీయించండి
నారుమడులకు నీరు ఇవ్వాలి
● త్వరలోనే కుడి, ఎడమ కాల్వల్లో పూడికతీత ● రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో భేటీలో ఎమ్మెల్యే రాందాస్
వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ నీరు విడుదల చేస్తారా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈమేరకు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పరిధి ఆయకట్టు రైతులతో వైరాలో శుక్రవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీరు సాఫీగా సాగేలా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీయించా లని రైతులు కోరగా పది రోజుల్లో పనిచేయిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇంకొందరు మాట్లాడుతూ.. గతంలోనూ వర్షాభావ పరిస్థితి ఎదురైనా నీరు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మరికొందరు రైతులు రిజర్వాయర్లో సరిపడా నీళ్లు లేనందున వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తామని తెలిపారు. ఎడమ కాల్వ పరిధి రైతులకు మరో పది రోజుల్లో నారుమడులకు నీరు ఇస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. ఆ తర్వాత వర్షాలు కురవకపోయినా నష్టాన్ని తామే భరిస్తామంటూ వెల్లడించారు.
పరిస్థితులు అనుకూలిస్తే..
ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.50 కోట్లతో కాల్వల ఆధునికీకరణ పనులు చేపడుతుండగా, రూ.100 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్ కెనాల్ ద్వారా రిజర్వాయర్కు గోదావరి నీరు విడుదల అవుతుందని చెప్పారు. కానీ, ప్రస్తుతం గోదావరి, సాగర్లో నీరు లేక రెండు చోట్ల నుంచి వచ్చే పరిస్థితి లేదన్నారు. అయినప్పటికీ వాతావరణం అనుకూలిస్తే నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఐబీ డీఈ శ్రీనివాస్, నాయకులు కట్ల రంగారావు, బోళ్ల గంగారావు, దాసరి దానియేలు, శీలం వెంకటనర్సిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్లో నీళ్లు లేక వైరా రిజర్వాయర్కు విడుదల చేయడం లేదు. పంటల విషయంలో రైతులు తొందరపడకుండా సంయమనం పాటిస్తేనే మేలు.
–బాబూరావు, ఈఈ
రిజర్వాయర్ కాల్వల పరిధిలో సిల్ట్ తొలగించాలి. తద్వారా ఏ మాత్రం నీరు విడుదల చేసినా చివరి వరకు అందుతాయి. వృథా కూడా కాదు. అధికారులు తొలుత ఆ పని చేస్తేనే అందరికీ మంచిది.
–బసవయ్య, బ్రాహ్మణపల్లి
ఆయకట్టుకు రైతులు పంటలు పండిస్తేనే జీవనాధారం. ప్రస్తుతం ఉన్న నీటిని నారుమళ్లకు ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు. వర్షాభావ పరిస్థిఽతులు ఉన్నప్పటికీ గతంలో నీరు విడుదల చేశారు.
–మోత్కుపల్లి రామారావు, విప్పలమడక


