ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విజయ డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య స్పష్టం చేసింది. జూన్ 25న ‘విజయ డెయిరీపై నీలినీడలు’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందులో ఖమ్మం యూనిట్లో ప్యాకింగ్ సెక్షన్ నిలిపివేత, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యంపై వివరించగా పలు పార్టీల నాయకులు డెయిరీని రక్షించాలంటూ ఆందోళనలు చేశారు. దీంతో పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ మధుసూదన్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. యాభై ఏళ్లు పైబడిన డెయిరీలో పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ పరికరాల నాణ్యత లోపించి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు తాత్కాలికంగా పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ నిలిపివేసి హైదరాబాద్లోని మెగా డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తుల సరఫరాకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యూనిట్ ఆధునికీకరణకు రూ.5 కోట్ల నిధులు అవసరం కాగా, శిథిలావస్థకు చేరిన భవనాన్ని పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఖమ్మం డెయిరీని ఆధునికీకరించాక ఇక్కడి నుంచే పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని వెల్లడించారు.
రూ.5 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదన


