ఖమ్మంలీగల్: ప్రమాదంలో నుజ్జయిన కారు విలువ రూ.6.31 లక్షలతోపాటు అదనంగా రూ.30 వేల పరిహారం చెల్లించాలని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గురువారం తీర్పు వెలువరించింది. గత ఏడాది మే 4న రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన మద్దినేని ఉపేందర్కు చెందిన హ్యుందాయ్ ఆరా కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఉపేందర్ కారు మరమ్మతు కోసం హ్యుందాయ్ సర్వీస్ సెంటర్కు తరలించగా రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ ఉండడంతో సదరు కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, ప్రమాద సమయంలో కారు నడిపిన డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడంటూ ఓ దినపత్రికలో వచ్చిందని క్లెయిమ్ను తిరస్కరించారు. దీంతో ఆయన న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ అనంతరం కారు విలువతో పాటు పరిహారం చెల్లించాలని కమిషన్ ప్రెసిడెంట్(ఎస్ఏసీ) వి.లలిత, మెంబర్ ఎ.మాధవీలత తీర్పు చెప్పారు.


