ధైర్యం‘గుండె’లా భరోసా.. | - | Sakshi
Sakshi News home page

ధైర్యం‘గుండె’లా భరోసా..

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

ఆర్జీ–1 ఏరియాలో తొలి క్యాథ్‌ల్యాబ్‌

కోల్‌బెల్ట్‌ ప్రజలకు

అత్యాధునిక హృదయ వైద్యసేవలు

కొత్తగూడెంలోనూ ఏర్పాటు చేయాలని వినతులు

రుద్రంపూర్‌: సింగరేణి కార్మికులు ఇక నుంచి గుండె మీద చేయివేసుకుని ఉండేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సంబంధిత రుగ్మతలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే క్యాథ్‌ల్యాబ్‌ను ఆర్జీ–1 (రామగుండం–1) ఏరియాలో ఏర్పాటు చేసింది. దీనిని త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే (సుమారు 32 వేల మంది) గోదావరి ఖని ప్రాంతంలో క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయటం అభినందనీయమని కార్మికులు, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

గోల్డెన్‌ అవర్‌ కోసం..

ప్రస్తుతం వయోభేదం లేకుండా గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌/కార్డియాక్‌ అరెస్ట్‌) వస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేం. ఈ సమస్య తలెత్తిన తర్వాత తొలి గంట సమయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పేర్కొంటారు. ఇది చాలాకీలకమైన సమయం. అప్పుడే చికిత్స అందితే ప్రాణాలు నిలుస్తాయి. ఈ చికిత్స కోసమే గోదావరి ఖనిలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను సింగరేణి ఏర్పాటు చేసింది. కోల్‌బెల్ట్‌ ప్రజలకు సకాలంలో తక్కువ వ్యవధిలో అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించింది.

ఏటా రూ.300 కోట్లు ఖర్చు

కార్మికుల ఆరోగ్యం కోసం సంస్థ ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ప్రధానంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల రిఫరల్‌ కోసం అధిక మొత్తం నిధులు కేటాయిస్తోంది. హృద్రోగ బాధితులు, సుమారు 3 వేల మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేశారని గణాంకాలు చెబుతున్నాయి. ఇకనుంచి అలాంటి వారికి చికిత్స అందించేందుకు 5 బెడ్లతో ఇన్సెంటివ్‌ కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌, 10 బెడ్లతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌తోపాటు నిపుణులైన వైద్యులతో ల్యాబ్‌ ఏర్పాటు చేసింది.

పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యం..

పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ క్యాథ్‌ల్యాబ్‌ కోసం సింగరేణి సంస్థ దాదాపు రూ.50 కోట్లను ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల టారీఫ్‌ల మేరకు అతి తక్కువ ఖర్చుతో స్థానికులకు కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించే సాకర్యం కల్పించింది. ప్రతినెల సుమారు 3 వేల మందికిపైగా ఈ సేవలను వినియోగించుకుంటారని అధికారుల అంచనా. అయితే, క్యాథ్‌ల్యాబ్‌లో ఉన్న బెడ్లలో 50 శాతం సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు.

గుండె సంబంధిత

రుగ్మతలకు చికిత్స

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement