వైరారూరల్: ఆర్టీసీ బస్సు యాక్సిల్ విరగడంతో ముందు టైరు ఊడిపోయింది. ఈ సమయాన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. భద్రాచలం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు(టీఎస్28 టీఏ 9910) 25 మంది ప్రయాణికులతో గురువారం ఖమ్మం వస్తోంది. మార్గమధ్యలో వైరా మండలం స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపైకి వచ్చేసరికి బస్సు ముందు టైరు యాక్సిల్ విరగడంతో కుడి వైపు టైరు ఊడిపోయింది. దీన్ని డ్రైవర్ గుర్తించి ఒక్కసారిగా బస్సు ఆపేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడితే భారీ ప్రమాదం జరిగేది. కాగా, వంతెన మధ్యలో బస్సు ఆగిపోవడంతో జాతీయ రహదారిపై సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు చేరుకుని బస్సును పక్కకు తొలగించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. కాగా, భద్రాచలం డిపో ఉద్యోగులు సరిగ్గా పరిశీలించకపోవడంతో ఈ ఘటన జరిగిందని పలువురు పేర్కొన్నారు.
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం


