కొణిజర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కీలకమని, ఇందుకోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా ఇప్పటినుంచే తర్ఫీదు ఇవ్వాలని తెలిపారు. తహసీల్దార్ ఎన్.అరుణ, ఎంఈఓ డి.అబ్రహం, హెచ్ఎం సుజాత, కౌన్సిలర్ బలరామయ్య తదితరులు పాల్గొన్నారు.
●వైరా: వైరాలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర పరిశీలించారు. మొత్తం 11 బ్లాక్లకు ఏడు బ్లాక్ల్లో డార్మెటరీ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడొద్దని తెలిపారు. అనంతరం 2వ వార్డులో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఆయన పరిశీలించారు. తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


