జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఖాదర్బాబా
మధిర/ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఖాదర్బాబా వెల్లడించారు. మధిర, ఎర్రుపాలెంలోని గ్రంథాలయాలను బుధవారం పరిశీలించిన ఆయన భవనాలు, సౌకర్యాలు, అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలు తెలుసుకున్నారు. మధిర గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేపట్టి పెరుగుతున్న పాఠకుల దృష్ట్యా నూతన భవన నిర్మాణం చేపట్టాలని పలువురు కోరారు. అంతేకాక ఉద్యోగ పోటీ పరీక్షల పుస్తకాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎర్రుపాలెం లైబ్రరీలో లైబ్రేరియన్ శ్రీనివాసరావుతో చర్చించగా, భవనానికి ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ ఖాదర్ మాట్లాడుతూ.. సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి నూతన భవనాల నిర్మాణంతో ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, కౌన్సిలర్లు నకిరికంటి రాజేశ్వరి, షేక్ రసీదున్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పారుపల్లి విజయ్కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకటరమణగుప్తా, మోదుగు బాబు, షేక్ ఇస్మాయిల్, షేక్ జానీబాషా, గుడేటి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


