● భద్రగిరిలో శిలాన్యాస్ తయారీ ● ఒక్కో శ్రీరామనామ ఇటుక రూ.60 ● నిర్మాణాలు, బహుమతులుగా ఇచ్చేందుకు పలువురి ఆసక్తి
శ్రీరాముడు కొలువై ఉన్న ప్రాంగణంలో ఇటుకలు తయారు చేసి, శ్రీరామ నామాన్ని ఆవాహనం చేస్తున్నాం. ఈ ఇటుక భక్తి భావనకు చిహ్నంగా మారుతుంది. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన ఈ ఇటుకలు నిత్యం అందుబాటులో ఉంటాయి. – కె.దామోదర్రావు,
రామాలయ ఈఓ, భద్రాచలం
భద్రాచలం శ్రీరామనామంతో ఇటుక ఉంటే మాకు శ్రీరామరక్షగా ఉందని భావిస్తాం. ఇంటిలో దేవుడి గదిలో పెట్టుకుని పూజిస్తాం. ఇంటి నిర్మాణాలకు ఇది వాడితే శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటుందని మా విశ్వాసం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– నరేష్, విశాఖపట్టణం
‘శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష’ శ్లోకం విశ్వ వ్యాప్తమైంది. దీనిని బుద్ధ కౌశిక రుషి రచించారని, శ్రీరాముడు రక్షకుడు, సమస్త జగత్తుకు అండగా ఉంటాడని అర్థమని పండితులు చెబుతున్నారు. ఈ శ్లోకాన్ని భద్రగిరి క్షేత్రంలో మరింతగా పఠిస్తుంటారు. అలాంటి శ్రీరామ నామాన్ని ఇటుకల్లో సైతం ముద్రించి భక్తులకు విక్రయించే కార్యక్రమాన్ని భద్రగిరి రామాలయ వర్గాలు చేపట్టాయి. దీంతో రామనామం విశ్వవ్యాప్తమవుతోందని అర్చకులు పేర్కొంటున్నారు. – భద్రాచలం
శిలాన్యాస్కు శ్రీకారం
శ్రీరామ శిలాన్యాస్ కార్యక్రమానికి భద్రాచలంలో ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. రామాయణ కాలంలో ఇటుకను శిలాన్యాస్ అని పిలిచారని, ఇక్కడ తయారుచేసే ఇటుకకు శ్రీరామ శిలాన్యాస్ అని నామకరణం చేశామని పండితులు చెబుతున్నారు. మట్టి, ఇసుక కలిపి ఇటుకల తయారీకి ప్రత్యేక అచ్చులను సిద్ధం చేశారు. ఇటుకలపై ‘జై శ్రీరామ్’ అని వచ్చేలా చేశారు. కాగా, మొదట మట్టితోనే ఇలాంటి ఇటుకలు తయారు చేసినా.. భక్తులు కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో పగిలిపోతున్నాయి. దీంతో ఇటీవల ఇసుక, సిమెంట్తో ఇటుకలను తయారుచేస్తున్నారు. వీటికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో ఇటుక రూ.60 చొప్పున భక్తులకు అందజేస్తున్నారు. ఆలయంలోని గోశాల ప్రాంగణంలో తయారు చేసి ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నారు.
పెరుగుతున్న ఆదరణ
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వీటిని కొనుగోలు చేసేందుకు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిని బస్సుల్లో తీసుకెళ్తుంటే విరిగిపోతాయని, ప్రయాణం కూడా భారమని కొందరు భయపడుతున్నారు. కార్లు, ఆటోల్లో వచ్చిన భక్తులు మాత్రం అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ సౌకర్యంతోపాటు, ఆలయం వారే నేరుగా ఇంటివరకు రవాణా చేస్తే మరింతగా ఆదరణ పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన సమయంలో ఈ ఇటుకలు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్గా ఇవ్వడంతో పాటు భక్తి, ఆధ్యాత్మికను పెంచే ధార్మిక కార్యక్రమాల్లో ఈ ఇటుకలు ఉపయోగించవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు.


