● మొదలైన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ● పలు కేంద్రాల్లో తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ ● విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురి తొలగింపు
కేంద్రంలోకి వస్తున్న విద్యార్థిని
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం మొదలయ్యాయి. తొలిరోజు తెలుగు పరీ క్షకు 16,962మంది విద్యార్థుల్లో 16,941మంది హాజరు కాగా... 21మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 9–30 గంటల నుంచి ప్రారంభం కాగా, విద్యార్థులను ఉదయం 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కాగా, ఖమ్మంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాష్ నగర్ రోడ్డులోని మౌంట్ ఫోర్ట్ పాఠశాలల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, పలు కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు తనిఖీ చేశారు.
నలుగురిపై వేటు
జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ చైతన్యజైనీతో పాటు జిల్లా స్థాయి అబ్జర్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. కొణిజర్ల జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రం ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్విజిలేటర్ సత్యనారాయణ, సిట్టింగ్ స్క్వాడ్ రవికుమార్, చీఫ్ సూపరింటెండెంట్ సుజాత, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మురళిని విధుల నుంచి తొలగించి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అలాగే, వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ తెలిపారు.


