● రూ.8.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్ ట్రాక్ ● సర్దార్ పటేల్ స్టేడియంలో శరవేగంగా నిర్మాణ పనులు ● ఈనెల చివరి నాటికి అందుబాటులోకి.. ● అంతర్జాతీయ టోర్నీలకు వేదికగా నిలవనున్న స్టేడియం
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ముస్తాబవుతోంది. ఇక అంతర్జాతీయ టోర్నీలకు సైతం ఆతిథ్యమిచ్చేందుకు అత్యాధునిక సదుపాయాలతో, సకల సౌకర్యాలతో సిద్ధమవుతోంది. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి ట్రాక్ అందుబాటులోకి రానుంది.
ప్రయోజనాలు ఎన్నో..
సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం వల్ల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించనుంది. ఈ ట్రాక్ ప్రత్యేక ఉపరితలాన్ని కలిగి ఉండటం వల్ల అథ్లెట్లు వేగంగా పరుగెత్తడానికి సహాయపడుతుంది. అలా గే, గాయాల తీవ్రత తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్పై శిక్షణ కొనసాగించవచ్చు. కనీస నిర్వహణతోనే దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ఇది రూపొందింది. సహజ మట్టి ట్రాక్తో పోలిస్తే సింథటిక్ ట్రాక్ అథ్లెట్లకు మెరుగైన ఉపరితలం, సౌకర్యం అందిస్తుంది. మట్టి ట్రాక్పై సాధన చేసి సింథటిక్ ట్రాక్పై పోటీల్లో పాల్గొన్నప్పుడు రన్నర్ల సామర్థ్య వేగం రెండింతలు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో లక్ష్యాన్ని వేగంగా ఛేదించే ఆవకాశాలుంటాయి. అంతేగాక సుమారు 1.5 నుంచి 2 సెకన్ల తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు జిల్లా అథ్లెట్లకు ఎదురయ్యా యి. దీంతో జిల్లాస్థాయి నుంచే సింథటిక్ ట్రాక్పై శిక్షణ చాలా అవసరమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్రీడాకారుల్లో ఆనందం
సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్లో మరింత ప్రో త్సాహం లభించనుంది. ఇప్పటికే సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు చెందిన అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించి, అధిక సంఖ్యలో పతకాలు సాధించారు. అంతేగాక జాతీయస్థాయి టోర్నీలకు అర్హత సాధిస్తున్నారు. ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పడిన నాటి నుంచి పతకాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని శిక్షకులు భావిస్తున్నారు.


