వైరా: 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ వైరా మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న పబ్లిక్ టాయ్లెట్ల వద్ద శుభ్రం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిత్యం ఉపయోగంచుకునేలా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం, కట్ల సంతోష్, నిమ్మతోట శ్రావణి, బోళ్ల గంగారావు, డాక్టర్ మురళీకృష్ణ, శీలం వెంకటనర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, 8వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ చిలకా చినకోటయ్య ఎమ్మెల్యే రాందాస్నాయక్తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లను సత్కరించారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జున్రావు, బాణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గడువుకు ముందే
ఇళ్ల స్థలాలు
ఖమ్మంమయూరిసెంటర్: వెలుగుమట్ల భూదా న భూముల్లో నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతోపాటు గడువుకంటే ముందుగానే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన పేదలకు న్యాయం చేసి నిజమైన ప్రజా ప్రభుత్వంగా నిలిచిందని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రాజకీయాలకు తావులేకుండా నిరుపేదలను గుర్తించి 311 కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలతో పాటు ఇందిర్మమ ఇళ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.
యూరియా వాడకం తగ్గించాలి
వైరా కేవీకే శాస్త్రవేత్త పావని
చింతకాని: పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని వెరా కేవీకే శాస్త్రవేత్త పావని పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, పంటలపై మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తే భూసారం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.నానో యూరియా, నానో డీఏపీ వల్ల కలి గే ప్రయోజనాలు, వరిలో ప్రస్తుతం ఉన్న వంగడాలు, ఆయిల్పాం సాగు,సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగం, నేచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు తాళ్లూరి స్వప్న, కంచం ద్రౌపతి, వత్సవాయి పద్మ, చాపలమడుగు వీరబాబు, షేక్ రహ్మతుల్లాతోపాటు బందెల నాగార్జున్, సట్టు వెంకటేశ్వర్లు, సోములపల్లి మానస, తేజ, ఆయేషా, కార్తీక్, రైతులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డుకు చెందిన వెంపటి ఉపేందర్, మరికొందరిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. తలారి రాధాకృష్ణ ఇల్లు అద్దెకు తీసుకుని షాపు నడిపిస్తున్నాడు. దానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో దుకాణం యజమాని వెంపటి ఉపేందర్ ఇంటి నుంచి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాడు. అనంతరం ఉపేందర్ విద్యుత్ సరఫరా కాకుండా వైర్ కట్ చేయగా ఇదేమిటని రామకృష్ణ ప్రశ్నించడంతో కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు దూషించాడు. ఉపేందర్ మరికొందరితో కలిసి దుకాణంలోని సామగ్రిని పగులగొట్టి, అద్దాలను ధ్వంసం చేశారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు ఉపేందర్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు.


