
గ్రామాల్లో ‘పనుల జాతర’
● నేడు ఊరూరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● ఉపాధి నిధులతో పనులకు శ్రీకారం ● జీపీ, అంగన్వాడీ భవనాలపై దృష్టి
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి.. నిరుపేద కూలీల కుటుంబాలకు జీవనోపాధి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖల సమన్వయంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘పనుల జాతర–2025’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యాన జిల్లాలోని 20 మండలాల పరిధి 571 గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
‘ఉపాధి హామీ’కి కొత్త రూపం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఎస్) పేదలకు పని కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ సమాజానికి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడుతోంది. ఈమేరకు పనుల జాతర కార్యక్రమం ద్వారా వేలాది మందికి పని కల్పించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇదే సమయాన వ్యక్తిగత, సామూహిక ఆస్తుల కల్పన పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురానున్నారు.
ప్రారంభోత్సవాలే లక్ష్యంగా..
‘పనుల జాతర’లో భాగంగా కీలకమైన నిర్మాణాల కు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు ఉన్నాయి. అలాగే, స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ) ద్వారా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను ప్రారంభిస్తారు. అంతేకాక వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘జలనిధి’ పథకం ద్వారా చేపట్టనున్న పనులకు కూడా భూమి పూజ చేస్తారు. ఇంకా ‘ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా’ కింద చేపట్టే వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులకు సైతం భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా పశువుల కొట్టాలు, కోళ్లు, గొర్రెల షెడ్లు, వానపాములతో ఎరువుల తయారీ కేంద్రాలు, అజోలా పిట్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ పనులు మహిళల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తాయని చెబుతున్నారు.
నిస్వార్థ సేవకులకు సత్కారం
సామూహికంగా చేపట్టే ఈ కార్యక్రమం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులను గౌరవించేందుకు కూడా వేదికగా నిలవనుంది. ఎక్కువ రోజులు పని చేసిన ఉపాధి కూలీలు, దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను అధికారులు సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు.
సమన్వయమే కీలకం
పనుల జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి విభాగాలైన ఉపాధి హామీ, స్వచ్ఛభారత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్–ఇంజినీరింగ్, వాటర్ షెడ్ వంటి అన్ని విభాగాల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.