
ప్రభుత్వ పాఠశాలలో క్రీడా వసతులు
● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ● వీ.వీ.పాలెం పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిచ్చేలా అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించగా, ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ శిక్షణ తీసుకుంటు న్న విద్యార్థులతో మాట్లాడి కాసేపు ఆయన కూడా ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటమి అంచుకు చేరినా పట్టుదల ఉంటే విజయం సాధించొచ్చన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీవైఎస్ఓ సునీల్రెడ్డి, కోచ్ ఆదర్శ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
●రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన నిర్దేశిత తేమ రాగానే కాంటా వేసి మిల్లులకు తరలించాలని తెలిపారు. ఎక్కడైనా తేమ, తాలు పేరిట కోత విధించినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఏపీఎం విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ సన్యాసయ్యను ఆదేశించారు. ఏఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఘునాథపాలెంలోని పల్లె దవాఖానా – ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని కలెక్టర్ తనిఖీ చేసి మందుల నిల్వలు, గర్భిణులు, సాధారణ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. సాధారణ ప్రసవాలతో లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.