
ఉత్సాహంగా10కే రన్
సాక్షి,బళ్లారి: నగరంలో మోకా రోడ్డులోని కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నుంచి బీసీఆర్ఎఫ్సీ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే రన్ ఉత్సాహంగా సాగింది. వారం రోజులు క్రితం ఏర్పాటు చేసిన పరుగు కార్యక్రమంలో సభ్యులు, ప్రముఖులు వాలంటీర్లుగా వ్యవహరించిన నేపథ్యంలో అందులో పాల్గొనలేకపోయారు. వారి కోసం 5 కిలోమీటర్లు,10 కిలోమీటర్ల రన్ చేపట్టారు. విక్రం అనే వ్యక్తి 21 కిలోమీటర్ల రన్నింగ్తో పాటు 5 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో సత్తా చాటాడు. మిగిలిన సభ్యులందరూ 5,10 కిలోమీటర్ల రన్నింగ్లో పాల్గొన్నారు. బీసీఆర్ఎఫ్ సభ్యలు సోమనాథ్, చంద్రశేఖర్, తిప్పారెడ్డి, గిరీష్కుమార్ గౌడ పాల్గొన్నారు.
జీఎస్టీ నుంచి
మినహాయించాలి
రాయచూరు రూరల్: విద్యాశాఖ అధీనంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రైవేటు పాఠశాలలు, కళాశాల సంఘం అధ్యక్షుడు మనోహర్ మస్కి డిమాండ్ చేశారు. అదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విద్యారంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్య సంస్థలకు అరోగ్య బీమా పథకం, ఆర్టీఈ ద్వారా ప్రవేశాలు కల్పించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిల విడుదల చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు మైదానాల సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో పాఠశాలల వాహనాలను తీసుకున్నారని, వాటికి డీజిల్, డ్రైవర్ భత్యాన్ని చెల్లించాలన్నారు. కేశవ రెడ్డి, రవి.శ్రీనివాస, థామస్, రజాక్ ఉస్తాద్ పాల్గొన్నారు.
డయట్ ప్రిన్సిపాల్
ఇందిర సేవలు అనన్యం
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో డయట్ ప్రిన్సిపాల్ ఇందిర అందించిన సేవలు అనన్యమని శిఖర మఠం మఠాధిపతి కిపిల సిద్దరామేశ్వర స్వామీజీ అన్నారు. ఇందిర ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. అధ్యాపక వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ రంగంలో పనిచేసేవారు సమాజాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఇందిరను ఘనంగా సన్మానించారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బీఈఓ ఈరణ్ణ, ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పాల్గొన్నారు.
భర్త బెదిరింపులపై
భార్య ఫిర్యాదు
హుబ్లీ: భర్త బెదిరింపులపై భార్య నగరంలోని దర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు కాటన్ పేట వద్ద నివసించే రితేష్ నాగరాజ్ జైన్కు ధార్వాడ తాలూకా లక్ష్మాపుర గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వారికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే పెళ్లి సమయంలో కులం పేరు చెప్పకుండా వివాహం చేశారని రితేష్ జైన్ తరచూ గొడవకు దిగేవాడు. అనంతరం అత్త కూడా వేధింపులకు దిగింది. దీంతో సావిత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వచ్చిన రితేష్జైన్, తల్లి రేఖా జైన్, పూజాకిషోర్లు తనను బెంగళూరు రావాలని డిమాండ్చేస్తూ కులం పేరుతో దూషించి ప్రాణాలు తీస్తామని బెదిరించిట్లు బాధితురాలు సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పీడీఓను నియమించాలని కార్యాలయం ముట్టడి
రాయచూరు రూరల్: పీడీఓను నియమించాలని డిమాండ్ చేస్తూ లింగసూగురు తాలుకా కోఠా గ్రామ పంచాయతీ ప్రజలు కార్యాలయాన్నిముట్టడించి తాళం వేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ రెండు నెలలుగా పీడీఓ లేక పోవడంతో అభివృద్ధి పనులు స్తంభించాయన్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారిందన్నారు. తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. పీడీఓ లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. వెంటనే పీడీఓను నియమించాలని డిమాండ్ చేశారు.

ఉత్సాహంగా10కే రన్

ఉత్సాహంగా10కే రన్

ఉత్సాహంగా10కే రన్