
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి ●
● 5 మందికి తీవ్ర గాయాలు
హొసపేటె: అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడటంతో స్థలంలోనే కార్మికుడు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలైన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగిలో బుధవారం సాయంత్రం జరిగింది. జార్ఖండ్కు చెందిన జ్యోతిలాల్(35) అనే కూలీ ట్రాక్టర్ బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విండ్ ఫ్యాన్లో పని చేస్తున్న 14 మంది కార్మికులు పని ముగించుకొని పనిముట్లతో తిరిగి ఇంటి వైపు ట్రాక్టర్లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకస్మికంగా ట్రాక్టర్ టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జ్యోతిలాల్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు కూడ్లిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూడ్లిగి స్టేషన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
వేధింపులతో విసిగి
బాలిక ఆత్మహత్య
● మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం
● రేపిస్ట్ సురేష్ అరెస్ట్, పోక్సో కేసు నమోదు
సాక్షి,బళ్లారి: నిర్భయ ఘటన తర్వాత మహిళలు, బాలికలపై అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మొన్న హుబ్లీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే అదే తరహాలో మైనర్ బాలికను ఓ యువకుడు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సండూరు తాలూకాలో కలకలం రేపింది. కామవాంఛ తీర్చాలని నిత్యం వేధిస్తుండటంతో పాటు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి మైనర్ బాలిక(16)పై అత్యాచారం చేయడంతో సదరు బాలిక జీవితంపై విరక్తి చెంది డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తనపై పక్కింటి అబ్బాయి సురేష్(25) అత్యాచారం చేశాడని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తనను వేధింపులకు గురి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డెత్నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తోరణగల్లు సబ్ఇన్స్పెక్టర్ తెలిపారు.
హైడ్రాలిక్ మొబైల్ క్రేన్ చోరీ.. నిందితుని అరెస్టు
హుబ్లీ: హైడ్రాలిక్ మొబైల్ క్రేన్ను చోరీ చేసుకొని పరారైన నిందితుడిని 72 గంటల్లో అరెస్ట్ చేసిన హుబ్లీ గ్రామీణ పోలీసులు అతడి నుంచి రూ.14 లక్షల విలువ చేసే క్రేన్ను జప్తు చేశారు. ఖానాపుర తాలూకా నందగడకు చెందిన సైఫుల్లా కమల్ సాహెబ్ ముల్లా అరెస్ట్ అయిన నిందితుడు. గత నెల 27న ఇక్కడి తారిహాళ పారిశ్రామికవాడలో పార్క్ చేసిన హైడ్రాలిక్ క్రేన్ను నిందితుడు చోరీ చేసి పరారయ్యాడు. ఘటనపై క్రేన్ యజమాని రఘునాథ కదం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు బెళగావి, కోల్హాపుర, సతార, కారడతో పాటు ఉత్తర కన్నడ జిల్లాలో తీవ్రంగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృతకృత్యులయ్యారు. ఈ కార్యాచరణలో సీఐ మురుగేశ చెన్నన్నవర, ఎస్ఐ ఎండీ పాటిల్, సిబ్బంది ఐహొళె, అబ్రార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ బృందం దొంగను పట్టి బంధించిన కార్యాచరణపై జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడ, ఏఎస్పీ నారాయణ భరమని అభినందించారు.
చిన్నారి కుటుంబాన్ని
ఆదుకోవాలని ధర్నా
హుబ్లీ: చిన్నారి హత్యాచారం కేసును ఖండిస్తూ ఆ చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట సమత సేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీరామనగర్కు చెందిన చిన్నారిపై జరిగిన హత్యాచారంపై విద్యాగిరి పోలీస్ స్టేషన్ కేసు నమోదైన సంగతి విదితమేనన్నారు. సదరు చిన్నారి కుటుంబ రక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం అందించాలన్నారు. ఆ చిన్నారి విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేసులో నిందితుడి ఆస్తులను జప్తు చేసి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరామనగర్లో కనీస వసతులు లేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక్కడ వీధి దీపాలు, సరైన రోడ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆ సంఘం ప్రముఖులు అరవింద, కృష్ణ, ఆనంద్, సతీష్, అంజాద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.