
యశవంతపుర: అనుమానం పెనుభూతంగా మారింది. అక్రమ సంబంధం అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం బెంగళూరు బసవేశ్వర నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగరలో జరిగింది. నిర్భయ తరహాలో భర్తే అతి దారుణంగా వ్యవహరించాడని డీసీపీ లక్ష్మణ నింబరిగి తెలిపారు. వివరాలు...మంజునాథనగరకు చెందిన నాగరత్న (32), భర్త అయ్యప్ప భార్య భర్తలు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
దంపతులకు కుమార్ (11), భూమిక (7) పిల్లలు ఉన్నారు. అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలి పనులకు వెళ్లేవాడు. భార్య నాగరత్న కూడా రామనగరలోని దుస్తుల దుకాణంలో పనులకు వెళ్లేది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా నాగరత్నపై అయ్యప్ప అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లలోమాట్లాడుతుంటంతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఒకరోజు అయ్యప్ప అక్క కొడుకు చంద్రు నాగరత్న ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో ఇద్దరు సన్నిహితంగా ఉండగా అయ్యప్ప చూశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ గొడవకు దిగాడు. అదే రోజు చంద్రు వద్ద ఉన్న మొబైల్ లాక్కోవడంతో అతను పారిపోయాడు. మూడు రోజుల క్రితం నాగరత్న నిద్రలో ఉండగా అయ్యప్ప రాక్షసుడిగా మారాడు. ఆమె మర్మాంగం వద్ద కిరాతకంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన తరువాత అతను పారిపోయాడు. బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.