బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శ్రీరామ వైన్షాపు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి పాశం అనిల్ శుక్రవారం నోటీస్ జారీ చేశారు. అలాగే పర్మిట్ రూమ్కూ ట్రేడ్లైసెన్స్ లేదని నోటీసులో పేర్కొన్నారు. వైన్షాపు నిర్వహణకు ట్రేడ్లైసెన్స్ తీసుకోవాలని గత ఏప్రిల్ 24న నోటీస్ జారీచేసినా నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఇదే చివరి నోటీస్గా పేర్కొంటూ ఒక్క రోజులో అవసరమైన పత్రాలు చూపించి జీపీలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు నోటీస్లో హెచ్చరించారు.
విషజ్వరంతో బాలుడు మృతి
వెల్గటూర్(ధర్మపురి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలకేంద్రానికి చెందిన మంతెన యశ్వంత్ (8) విషజ్వరంతో మృతిచెందాడు. బాలుడికి మూడురోజులుగా తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో తల్లిదండ్రులు చికిత్స చేయించారు. శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాలుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీకి చెందిన సూర వెంకటేశ్ (22)ను గురువారం సాయంత్రం హత్య చేసిన అతని తండ్రి సూర రాజయ్య అలియాస్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. హత్యకు గురైన వెంకటేశ్ జులాయ్గా తిరుగుతూ నిత్యం మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను తీవ్రంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురైన తండ్రి రాజయ్య గొడ్డలితో తలపై కొట్టడంతో వెంకటేశ్ అక్కడకిక్కడే మృతిచెందాడన్నారు.
నేటినుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు
రామగుండం: ప్రయాగ్రాజ్(ఉత్తరప్రదేశ్)–తిరునల్వేలీ(తమిళనాడు) మధ్య నార్త్ సెంట్రల్ రైల్వే (ఉత్తర మధ్య రైల్వే జోన్)కు చెందిన ప్రత్యేక రైలును ఈనెల 19వ తేదీ నుంచి ప్రతీ శనివారం నెలరోజుల పాటు (నాలుగు ట్రిప్పులు) నడిపించనున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాగ్రాజ్–తిరునల్వేలి(04171) మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రయాగ్రాజ్లో ఉదయం 10.20గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.22గంటలకు రామగుండం చేరుకుంటుంది. తిరునల్వేలి–ప్రయాగ్రాజ్(04172) మధ్య నడిచే రైలు తిరునల్వేలిలో సోమవారం రాత్రి 11.30గంటలకు బయలుదేరి బుధవారం వేకువజాము 12.48గంటలకు రామగుండం చేరుకుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కేవలం రామగుండంలోనే హాల్టింగ్ కల్పించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకొని 21 బోగీలను ఏర్పాటు చేయడంపై ప్రయాణికుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మల్కపేటలో ఒకరికి డెంగీ?
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేటలో ఒకరికి డెంగీ నిర్ధారణ అయినట్లు సమాచారం. గ్రామానికి చెందిన శివ(14) డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని చికిత్స కోసం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామంలో గత వారం రోజుల క్రితమే డెంగీ కేసు నమోదైంది.


