కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో తాజాగా చేపట్టిన ఔట్ సోర్సింగ్ నియామకాలపై వివాదం ముదురుతోంది. ఎస్యూలో కొలువుల పేరిట డబ్బులు దండుకున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవల జరిగిన ఔట్సోర్సింగ్ ఎంపిక ప్రక్రియలోనూ అక్రమాలు జరిగా యని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
36 మంది ఎంపిక
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇటీవల ఎస్యూలో నియామకాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరించారు. వివిధ విభాగాలకు 36మందిని ఎంపిక చేసి, నియామక పత్రాలు అందించారు. వీరి నియామకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురి విజ్ఞప్తులను ఎస్యూ అధికారులు చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపికై న గ్రూప్–4 ఉద్యోగులకు శాతవాహన యూనివర్సిటీలో పోస్టింగ్ ఇచ్చారు. అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవానే సాగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
నియామకాలపై ఆరోపణలు
వర్సిటీలో 36 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అక్రమంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వీరికి రాజకీయ పలుకుబడితో చేరిన ఓ ఉద్యోగి సాయం చేశాడని వినికిడి. షాడో వీసీగా పేరున్న సదరు వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. వీరికి వర్సిటీలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామాకాలపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై శాతవాహన వీసీ, రిజిస్ట్రార్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
విచారణ జరిపించాలి
వర్సిటీలో సరైన నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలి. నియామకాల్లో ఎలాంటి పారదర్శకత పాటించలేదు. రోస్టర్ విధానం, ప్రభుత్వ నిబంధనలను విస్మరించారు. విధులకు హాజరుకాకపోయినా కొందరు వేతనాలు పొందుతున్నారు. కనీస విద్యార్హతలు లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
– కరికె మహేశ్,
శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్
మరోసారి తెరపైకి యూనివర్సిటీ నియామకాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పెద్దమొత్తంలో వసూలు?
ఇటీవల జరిగిన 36మంది ఎంపిక ప్రక్రియపై అనుమానాలు
పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటున్న విద్యార్థులు


