జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన కౌలు రైతు చిర్ర సత్తయ్య (50) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. సత్తయ్య గ్రామానికి ఓ వ్యక్తి వద్ద భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఉదయం 11 గంటలకు వెళ్లి చూసేసరికి బావి వద్ద సెల్ఫోన్ కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా సత్తయ్య మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, మృతదేహాన్ని పరిశీలించగా సత్తయ్య కుడి కాలుకు విద్యుత్ షాక్ తగిలినట్లు ఆనవాళ్లు ఉండటంతో పాటు, కాలు వేళ్ల మధ్య గాయాలున్నట్లు కన్పించడంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా అక్కడకు చేరుకుని పరిశీలించారు. బావి వద్ద ఉన్న మోటార్కు విద్యుత్సరఫరా అవుతున్నట్లు విద్యుత్ అధికారులు నిర్ధారించారు. మృతుడు విద్యుత్షాక్ తగిలి బావిలో పడి మృతిచెందినట్లు అధికారులు తేల్చారు.


