కరీంనగర్: తల్లి జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. వైద్య వృత్తిలో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటూనే, కొంత మంది డాక్టర్లు సామాజికసేవలో తరిస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటున్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కథనం..
మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్టును 2017 ప్రారంభించా. ఏటా 10 మందికి రూ.30 లక్షలు వెచ్చించి ఉచిత కీలు మార్పి డి ఆపరేషన్లు చేస్తున్నా. నా భార్య డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఏటా 10మంది సంతానం లేని దంపతులకు రూ.20 లక్షలు ఖర్చుచేసి ఉచిత ఐవీఎఫ్ వైద్య సేవలు అందిస్తున్నారు.
– డాక్టర్ బంగారి స్వామి, ఆర్థోపెడిక్ సర్జన్
ఆడపిల్ల భారమని భావించే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలుగుతాయని మా ఆస్పత్రిలో దేవీ పుత్రిక పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సాధారణ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నాం. – ఎనమల్ల శ్రీదేవి, గైనకాలజిస్టు
బీఎన్.రావు చారిటబుల్ ట్రస్టు పేరుమీద 2017 నుంచి సేవ కార్యక్రమాలు చేపడుతున్నా. ఉమ్మడి జిల్లాలో అనీమియా సమస్యతో బాధపడే 10వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం అందజేశాను. కరోనా సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు లక్ష మాస్కులు, 20వేల శానిటైజర్స్ పంపిణీచేశాను. 100 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాం. మహిళకు కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధికల్పిస్తున్నాం.
– డాక్టర్ బీఎన్ రావు,
రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు


