కరీంనగర్టౌన్: కరువు వచ్చినప్పుడు ఆదుకునేదే కాళేశ్వరం ప్రాజెక్టు అని, కేసీఆర్కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగు, తాగునీటిని అందించడం లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో నగర ప్రజలు, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులకు నీటి ఇబ్బందులు మొదలైన దృష్ట్యా శనివారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఎల్ఎండీలో క్రికెట్, హాకీ, వాలీబాల్ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రెండు దశాబ్దాల చరిత్రలో జూన్లో ఎల్ఎండీ నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి పడిపోవడం ఇదే మొదటిసారి అని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఎల్ఎండీలో ఎప్పుడూ 10 టీఎంసీలు నిల్వ ఉండేలా జీవో విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కన్నెపల్లిలోని మోటార్లను ఆన్చేసి మిడ్మానేరు, ఎల్ఎండీలను నింపాలన్నారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడాతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


