కరీంనగర్కార్పొరేషన్: నగరంలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నగరపాలకసంస్థ కమిషనర్, ఈఆర్వో ప్రఫుల్ దేశాయ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం బల్దియా సమావేశ మందిరంలో బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం పనికిరాదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు తీసుకోవడానికి వీలులేదన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫాంలను పూర్తి చేసేలా బీఎల్వోలు ఓటరుకు అవగాహన కల్పించాలన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లో ఎర్రర్, అన్ కలెక్టెబుల్తో పాటు, ఫార్మాట్ ప్రకారం వివరాలు నింపని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.


