కరీంనగర్: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం 0–5 ఏళ్ల వయస్సులోపు చిన్నారులకు ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 91,178 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు గాను 1,00,300 పోలియో డోస్లు సిద్ధంగా ఉంచారు. 18 పీహెచ్సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, గ్రామ పంచాచతీ కార్యాలయాలు, వార్డు ఆఫీసులు, డివిజన్ కార్యాలయాలు, ప్రముఖ కూడళ్లలో సెంటర్లు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు. ఈనెల 29,30వ తేదీల్లో జిల్లా కేంద్రంతో పాటు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటా సర్వే నిర్వహించి చుక్కల మందు వేసుకోని చిన్నారులకు అక్కడే పోలియో చుక్కలు వేయనున్నారు. వలస కూలీల పిల్లలకు వారి నివాసాల వద్దకే బృందాలను పంపించి పోలియో చుక్కలు వేయనున్నారు.
పనితీరుతో ప్రతిష్ట పెంచాలి
తిమ్మాపూర్: పోలీసులు తమ పనితీరుతో శాఖ ప్రతిష్టను పెంచాలని, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ ఆవరణలోని పరిసరాలను పరిశీలించి మొక్క నాటారు. అనంతరం తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి పోలీస్ స్టేషన్ల పనితీరుపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. సర్కిల్ పరిధిలోని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని సీపీ పేర్కొన్నారు. సీఐ బొల్లం రమేశ్ అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. డీజీపీ ఆదేశాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థను అందించాలని సీపీ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్కుమార్, ఎస్సై అన్వర్, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు నరేందర్రెడ్డి, పృథ్వీగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఉన్నత విద్య పర్యటనకు శాతవాహన వీసీ
కరీంనగర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూలై 6 వరకు జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ యు.ఉమేశ్కుమార్ ఎంపికయ్యారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సరసిజ కూడా ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన సిఫార్సులు అందించనున్నారు.


