పెద్దపల్లిరూరల్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని కొందరు మిల్లర్లు మాయం చేసి రూ.కోట్లకు పడగలెత్తారు. పెద్దపల్లిలోని సుభాష్నగర్ ప్రాంతంలో గల శ్రీ విజయశ్రీ రైస్ మిల్లు యజమాని రూ.4.50 కోట్లు విలువ చేసే 1,706 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేసి ప్రభుత్వాన్ని మోసం చేశాడంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రవీణ్కుమార్ గురువారం ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్తో కలిసి వెల్లడించారు.. సీఎంఆర్ ధాన్యం నిల్వలను పెద్దపల్లిలోని శ్రీవిజయశ్రీ రైస్మిల్లులో పౌర సరఫరాల శాఖ డెప్యూటీ తహశీల్దార్లు రవీందర్, మహేశ్కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ తనిఖీచేశారు. మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ, బియ్యం అప్పగించకపోగా, మిల్లులో రూ.4,49,45,043 విలువగల 17,406 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లు యజమాని రాజేందర్ మాయం చేసినట్టు గుర్తించామని పౌర సరఫరాల అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా ధాన్యాన్ని మాయం చేసి మోసగించిన విషయమై సదరు అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిల్లు యజమానిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్టు సీఐ తెలిపారు.
మాయమైన రూ.4.5కోట్ల విలువగల 17వేల క్వింటాళ్ల ధాన్యం
మిల్లు యజమాని అరెస్ట్


