అక్కడ వార్‌.. ఇక్కడ బేజార్‌ | - | Sakshi
Sakshi News home page

అక్కడ వార్‌.. ఇక్కడ బేజార్‌

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 7:45 AM

78,310

80,000

3,50,000

62,285

41,000

3,39,715

2,27,408

1,60,000

కరీంనగర్‌

సిరిసిల్ల

జగిత్యాల

పెద్దపల్లి

యుద్ధం దెబ్బ

అమాంతం పెరిగిన ఎల్పీజీ ధరలు

లీటరుకు రూ.30కి పైగా పెంచిన డీలర్లు

భారీగా వంటచెరుకు ఆర్డర్లు ఇస్తున్న హోటళ్లు

ఎలక్ట్రిక్‌ స్టవ్‌లకూ పెరిగిన డిమాండ్‌

గ్రానైట్‌ ఎగుమతులపై దెబ్బ

ఉమ్మడి జిల్లాపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

శ్చిమాసియాలోని యుద్ధం వెతలు ఇన్నిన్ని కాదయా.. ఇంటింటా వంటింటా తిప్పలేనయా! అన్నట్లుగా ఉంది పరిస్థితి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడి ఎల్పీజీ సరఫరాలో తలెత్తిన అంతరాయం ఉమ్మడి జిల్లాపై భారీగానే పడింది. గృహాలతోపాటు వాహనాలు, హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, హాస్పిటళ్లను సైతం ఎల్పీజీ కొరత ముప్పు వెంటాడుతోంది. యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గృహ(రూ.60), కమర్షియల్‌ సిలిండర్‌ (రూ.115) ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన ఎల్పీజీ సరఫరా మునుపటిస్థాయిలో ఉండటం లేదని డీలర్లు అంటున్నారు. కొరతతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా వాహనాలకు విక్రయించే ఎల్పీజీ గ్యాస్‌ కేవలం వారం రోజుల్లోనే లీటరుకు రూ.30కిపైగా పెరగడం పరిస్థితికి నిదర్శనం.

నిండుకుంటున్న గ్యాస్‌

ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలో 50కిపైగా ఎల్పీజీ స్టేషన్లు ఉన్నాయి. ప్రతీరోజూ ఆటోలు, కార్లు తదితర వాహనాలు 50వేల లీటర్ల వరకు ఎల్పీజీ నింపుకొంటున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరుకు రూ.55గా ఉన్న ఎల్పీజీ తాజాగా గురువారం లీటరు రూ.86కు పెరిగింది. ఈ లెక్కన ప్రతీరోజూ ఉమ్మడి జిల్లా ఎల్‌పీజీ వాహనాలపై రూ.కోటిన్నర వరకు భారం పడుతోంది. యుద్ధం మరింత ముదిరితే ఎల్పీజీ ధర లీటరుకు రూ.100 పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని గ్యాస్‌ స్టేషన్‌ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోలుతో పోలిస్తే.. గ్యాస్‌ ధర చవక, అధిక మైలేజీ ఇవ్వడం, పర్యావరణ హితంగా ఉండటంతో కొన్నాళ్లుగా ఎల్పీజీ వాహనాలకు డిమాండ్‌ పెరిగింది.

హోటళ్లు, హాస్పిటళ్ల జాగ్రత్తలు

యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తగ్గిపోతుండటంతో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, హాస్పిటళ్లు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లు ముందు జాగ్రత్తగా వంటచెరుకు, చార్‌కోల్‌ తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో రెసిడెన్షియల్‌ హాస్టళ్ల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పదోతరగతితో పాటు పాఠశాల విద్యార్థులకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక సాధారణ ప్రజలు ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్‌ కుక్కర్లకు డిమాండ్‌ పెరిగింది. మూలన పడిన పాత స్టవ్‌ను రిపేర్లకు బయటికి తీస్తున్నారు. ఒకవేళ ఎల్పీజీ కొరత ముదిరి సంక్షోభంలా మారితే.. హోటళ్లు మూతబడితే.. అందులో పనిచేసే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది.

గ్రానైట్‌ పరిశ్రమపై దెబ్బ

రాష్ట్రంలో గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న కరీంనగర్‌ జిల్లాపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. కరీంనగర్‌ నుంచి ఆంధ్రా మీదుగా చైనా, ఇటలీకి వెళ్లే కరీంనగర్‌ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. యుద్ధం కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల కారణంగా షిప్పింగ్‌ ఛార్జీలు పెరగడం ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కంటైనర్‌కు 21 డాలర్లుగా ఉన్న ధర ప్రస్తుతం 28 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే యంత్ర పరికరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 250 రూపాయలు ఉన్న డ్రిల్లింగ్‌ బిట్టు ధర ఇప్పుడు ఏకంగా 1200 రూపాయలకు చేరడం పరిశ్రమ దీనస్థితికి అద్ధం పడుతోంది. మరోవైపు, క్వారీలను నడపడానికి అత్యంత కీలకమైన డీజిల్‌ సరఫరాపై కూడా ఆందోళన నెలకొంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్‌ అవసరం కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగితే.. అందులో పనిచేసే వేలాది మంది ఉత్తరాది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉమ్మడి జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement