వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
● చికిత్స పొందుతూ మృతి
జగిత్యాలక్రైం: మతిస్థితిమితం లేని ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. హైదర్పల్లికి చెందిన వంగ రాజవ్వ (72) తన మనుమరాలు గోనెపల్లి మమతతో ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతోంది. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని గోనెపల్లి అనిల్ రాజవ్వను కర్రతో కొట్టాడు. తల, చాతిలో బలమైన గాయాలవడంతో స్థానికులు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్ఎంపీ పర్శరాములు క్లినిక్కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య షబేరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.
హుజూరాబాద్రూరల్: మండలంలోని శాలపల్లె ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనవేని కనుకయ్య(74) మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన కనుకయ్య రోడ్డు దాటుతుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
పెళ్లయిన రెండు నెలలకే..
● రోడ్డుప్రమాదంలో ఒకరు దుర్మరణం
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్ (23) బైక్ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లోకేశ్కు కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వాహనం అదుపుతప్పి యువకుడు..
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి.
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి


