భారం కాదు.. బాధ్యత | - | Sakshi
Sakshi News home page

భారం కాదు.. బాధ్యత

Aug 18 2025 6:17 AM | Updated on Aug 18 2025 6:17 AM

భారం కాదు.. బాధ్యత

భారం కాదు.. బాధ్యత

వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే కటకటాలే.. వయోవృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టం డివిజన్‌స్థాయిలో ట్రిబ్యునల్‌ ఏర్పాటు రోడ్డుపై వదిలేసినా క్రిమినల్‌ కేసులు

కరీంనగర్‌: తల్లిదండ్రుల తర్వాతే దైవం.. ప్రత్యక్ష దైవాలైన వీరు మలిసంధ్యలో పడరాని పాట్లు పడుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసి వారి బంగారు భవిష్యత్‌ కోసం శ్రమిస్తే.. వృద్ధాప్యంలో వారిని పట్టించుకోవడం లేదు. రెక్కలొచ్చిన కొడుకులకు కన్నవారు బరువైపోతున్నారు. రక్త బంధాన్ని తెంచుకుని ముసలి తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్‌ పెడుతూ ప్రభుత్వం డివిజన్‌స్థాయిలో ఓ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసింది. వృద్ధులైన తల్లిదండ్రులను వీధిపాలు చేస్తే కొడుకులు కటకటాలు లెక్కపెట్టాల్సిందే.

వృద్ధాశ్రమాల్లో చేర్పించి..

కోట్లు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులకు తనయులు పట్టెడు అన్నం పెట్టడం లేదు. అయినవారికి దూరంగా ఉంటూ జీవనం గడుపుతున్న వారి గాథలు కన్నీళ్లు తెప్పించక మానవు. జీవిత చరమాంకంలో ఆదుకోవాల్సిన తనయులు వదిలేస్తున్నారు. వయోభారంతో వృద్ధులు అవస్థలు పడి విసిగిపోయి న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీస్‌స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొందరు కుమారులు తెలివిగా వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు.

విస్మరిస్తే క్రిమినల్‌ కేసులు

వృద్ధుల సంపూర్ణ బాధ్యత ఉన్న వ్యక్తులెవరైనా అందుకు విరుద్ధంగా శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టినా, వారికి హానీ తలపెట్టినా 3 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ అమలుకావచ్చు.

సహాయ కేంద్రం

వయోవృద్ధుల సహాయార్థం జిల్లా కేంద్రంలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14567 ఏర్పాటు చేశారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, హుజూరాబాద్‌, కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్‌ డివిజన్ల వారీగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు. అక్కడ డివిజన్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారు. వృద్ధుల సంఘం నుంచి ఒక ప్రతినిధి, కౌన్సిలేషన్‌ అధికారి ఉంటారు. సంబంధిత డివిజన్‌ కార్యాలయంలో వృద్ధులు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీవో సంబంధిత తహసీల్దార్‌ను విచారణకు ఆదేశిస్తారు. ఇరు వర్గాలను పిలిచి వాదనలు విని న్యాయం చేస్తారు. వినని పక్షంలో కౌన్సిలేషన్‌ అధికారికి అనుసంధానం చేస్తారు. ఆయన ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా అప్పిలేట్‌ అధికారి కలెక్టర్‌ను ఆశ్రయించవచ్చు. వృద్ధులే కాకుండా ఎన్జీవోలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేవారు నిర్ణీత ఫాం పూర్తి చేసి డివిజన్‌ రెవెన్యూ అధికారికి అందించాలి.

ప్రయోజనం ఇలా..

సొంత సంపాదనతో తమను తాము పోషించుకోలేని వృద్ధులు ఈ చట్ట ప్రకారం తమ పిల్లలను, సంతానం లేని వృద్ధులు వారి ఆస్తిని అనుభవించే బంధువులను పోషణ గురించి అడగవచ్చు. పోషణ ఖర్చులో ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య సహాయం, చికిత్సకు అవసరమైన మొత్తం నెలకు రూ.10 వేలకు మించకుండా అందేలా ట్రిబ్యునల్‌ చర్యలు తీసుకుంటుంది.

పత్రికా కథనాలపై విచారణ

వివిధ దినపత్రికల్లో వచ్చే వృద్ధుల కథనాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పత్రికల కథనాలపై జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం సంబంధిత తహసీల్దార్‌లకు సమాచారం ఇస్తుంది. తహసీల్దార్‌ వాస్తవ నివేదికను రూపొందించి ఆర్డీవోకు నివేదిస్తారు. అధికారులు ఇరువర్గాలను పిలిచి రాజీ కుదర్చడమో, కేసు నమోదు చేయడమో నిర్ణయిస్తారు.

వయోవృద్ధుల సంక్షేమ చట్టం

వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ప్రకారం కన్నవారిని విస్మరిస్తే జైలు కూడు తినాల్సిందే. మలిసంధ్యలో ఆదరించాల్సిన కుమారులు వారిని పట్టించుకోపోతే ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ చట్టం ప్రకారం తల్లి, తండ్రి, సవతి తండ్రి/తల్లిని వయో

వృద్ధుల కింద పరిగణిస్తారు.

జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు

జిల్లావ్యాప్తంగా 2023లో 117 ఫిర్యాదులు, 2024లో 129 ిఫర్యాదులు,

2025లో (ప్రస్తుతం ఇప్పటి వరకు)101 ఫిర్యాదులు వచ్చినట్లు సంక్షేమ శాఖ అధికారులు

పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement