
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్
వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. సంవత్సరంన్నర పాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
లారీ, బైక్ ఢీకొని ఒకరి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
మంథని: మున్సిపల్ పరిధిలోని గంగాపురి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన చెట్టం వెంకటేశ్(30) మృతి చెందాడు. మంథని మండలం ధర్మారం గ్రామానికి చెందిన తిప్పని అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేశ్, అభిలాష్ ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై పెద్దపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అభిలాష్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
చొప్పదండి: మండలంలోని దేశాయిపేటకు చెందిన ఎలకపల్లి అంజయ్య సౌది అరేబియాలో మృతి చెందగా గురువారం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన అంజయ్య అక్కడ మృతి చెందగా కుటుంబ సభ్యులు గల్ఫ్ జేఏసీని సంప్రదించారు. వారి కృషితో ఎట్టకేలకు మృత దేహం స్వగ్రామానికి చేరుకుందని గ్రామస్తులు తెలిపా రు. అంజయ్య కుటుంబానికి రూ.ఐదులక్షల ఎక్స్గ్రేషియా వచ్చేలా చూడాలని, మృతదేహం దేశాయిపేటకు రావడానికి 22 రోజుల సమయం పట్టిందని, ఇటువంటి ఇబ్బందులు రాకుండా రూ.ఐదువందల కోట్లతో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కాంత ప్రభుత్వాన్ని కోరారు.